26 August 2006

సుమతీశతక స్ఫూర్తి-8

శృంగారం పట్ల శతకకర్త వైఖరి

మన ప్రాచీన గ్రంథాలన్నీ పురుషులు పురుషుల కోసం రాసినవే.కనుక కవి ఈ శతకంలో నిర్దేశించినదంతా పురుషులు తమ జీవితాల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనేదే. ఈ క్రింది పద్యాల్లో కవి పరస్త్రీ వ్యామోహాన్నీ, స్త్రీలోలతనీ నిరసించాడు.

క. పరనారీ సోదరుడై, పరధనముల కాశపడక పరులకు హితుడై
పరులు తను బొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ !

క. పరు నాత్మ దలచు సతి విడు, మఱుమాటలు పలుకు కొడుకు మన్నింపకుమీ !
వెఱపెఱుగని భటు నేలకు, తఱచుగ సతి గవయబోకు తగదుర సుమతీ !
క. పరులకనిష్టము సెప్పకు, పొరుగిండ్లకు పనులు లేక పోవకుమెపుడున్
పరు గవసిన సతి గవయకు, ఎఱిగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ !

క. పర్వముల సతుల గవయకు, ఉర్వీశ్వరు కరుణ నమ్మి ఉబ్బకు మదిలో
గర్వించు ఆలి పెంపకు, నిర్వాహము లేని చోట నిలువకు సుమతీ !

పెళ్ళాన్ని అతి గారాబం చెయ్యవద్దంటున్నాడు పై పద్యంలో! అంతమాత్రం చేత కవి శృంగార విముఖుడని ఎవరైనా పొరపడే అవకాశముంది. కుటుంబాన్ని క్రమశిక్షణ (discipline)లో పెట్టడానికీ, శృంగార రసికుడు కావడానికీ పరస్పర వైరుద్ధ్యమేమీ లేదు. ఈ క్రింది "A" సర్టిఫికేట్ పద్యాలు పరిశీలించండి:

క. తములము వేయని నోరును, రమణుల చనుమొనల మీద రాయని మేనున్
కమలములు లేను కొలనును, హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ !

క. నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్
నారియె నరులకు రత్నము, చీరయె శృంగారమండ్రు స్త్రీలకు సుమతీ !

క. పలు దోమి చేయు విడియము, తల కడిగిన నాటి నిద్ర, తరుణుల తోడన్
పొలయలుకనాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ !
(పొల + అలుక = ప్రేమకలహం)

క. వీడెము సేయని నోరును, చేడెల అధరామృతంబు చెందని నోరున్
పాడంగరాని నోరును, బూడిద కిరవైన పాడుబొందర సుమతీ !

క. శుభముల నొందని చదువును, అభినయమును రాగరసము నందని పాటల్
అభిలాష లేని కూటమి, సభ మెచ్చని మాటలెల్ల చప్పన సుమతీ !
(కూటమి = రతిక్రీడ)

దీన్నిబట్టి కవి ఎవరి నుద్దేశించి ఈ శతకం రచించాడో సుస్పష్టం. వ్యుత్పన్నులు కానటువంటి అపరిణత శిశువుల కోసం ఆయన దీన్ని రచించలేదు. సుమతీశతకంలోని విషయాలు బడిపిల్లలకర్థమయ్యేంత సరళమైన భావాలు కావు.

2 వ్యాఖ్యలు ;:

Ramanadha Reddy చెప్పారు...

ఉపయోగపడే మాటలే అన్నీ, కానీ, నాకో చిన్న సందేహం మన కవి Polygamy ని సమర్థిస్తున్నాడా అని, ఈ మాటలు చూడండి...
1. రమణుల చనుమొనల మీద రాయని మేనున్
2. తరుణుల తోడన్ పొలయలుకనాటి కూటమి
3. చేడెల అధరామృతంబు చెందని నోరున్

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

రామనాథ రెడ్డిగారూ

పాత సమాజాల్లో బహు స్త్రీ ప్రేమికత్వం సర్వసాధారణంగా ఉండేది.అంటే మగవారంతా అంతే అని కాదు. ఎవరికైనా ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే జనం ఇప్పటిలాగా ఆశ్చర్యపోయేవారు కారు.అందుచేత సుమతీ శతక కర్త ప్రత్యేకంగా దక్షిణ నాయకత్వాన్ని సమర్థించే శ్రమ తీసుకున్నాడనుకోను.ఆయన సమకాలీన ధోరణి పద్యాల్లో ప్రతిఫలించిందంతే !

సుమతీ శతకం రాసింది మీరన్నట్లు బద్దెనే అయివుండవచ్చు.కాదనను.అలాగని ఔననను.సమస్య ఏంటంటే ఏ విషయమూ తేల్చడానికి ఆధారాలు లేవు.కాని ఏదో ఒక పేరంటూ ఉండాలి కాబట్టి బద్దెన అనే అనుకుందాం.నష్టమేముంది ? మొత్తం మీద ఆ కవి రాజు మాత్రం అయివుండడు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :- ఇది సనాతన, సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.